మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు
యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, దుబాయ్లో చిక్కుకుపోయిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ అశ్వారావుపేట మండలంలో ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి తుమ్మల అల్లుడు శేఖర్కు దుబాయ్లో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయనను పరామర్శించేందుకు అయన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. అయితే, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల దుబాయ్ విమానాశ్రయంపై దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తమ ప్రియతమ నాయకుడు సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, మాజీ సర్పంచ్ నార్లపాటి సత్యవతి-రాములు తనయుడు నార్లపాటి రాజశేఖర్ మంగళవారం స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి క్షేమంగానే ఉన్నారని అధికారులు ప్రకటించినప్పటికీ, ఆయన త్వరగా తమ మధ్యకు రావాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








