లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లిన ఆయన విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులతో పాఠాలు చదివించడంతో పాటు, పలు ప్రశ్నలు వేసి వారి విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే పాఠశాలలో ఎమ్మెల్యే భార్య వరలక్ష్మి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఆమె పట్ల ఎలాంటి ప్రత్యేకత చూపకుండా ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా పాఠశాల పనితీరును నిశితంగా పరిశీలించడం గమనార్హం. అనంతరం ఉపాధ్యాయులతో భేటీ అయి బోధనా పద్ధతులు, విద్యార్థుల హాజరు శాతం మరియు పాఠశాలలో ఉన్న మౌలిక వసతులపై చర్చించి, నాణ్యమైన విద్యను అందించాలని దిశానిర్దేశం చేశారు.








