ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్*
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.
కొణిజెర్ల మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన అమర్లపూడి భాస్కర రావు సర్వే నెంబర్ 82, 83 లో తమ భూమి ఉందని, సర్వే నెంబర్ 81లో ఉన్న తమ భూమిని సబ్ స్టేషన్ కోసం కేటాయించగా హైకోర్టు కేసు పెండింగ్ ఉండటంతో ఆ స్థలం నుంచి మార్చడం జరిగిందని, ప్రస్తుతం మున్సిపాలిటీ వారు అదే స్థలంలో ఎటు వంటి సర్వేలు చేపట్టకూడదని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ డంపింగ్ యార్డ్ కు కేటాయించారని, దీనిని సరిచేసి తమ పేరు మీద పట్టా పాస్ పుస్తకాల జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామం పెద్దతండకు చెందిన గిరిజనులు గత ప్రభుత్వం సర్వే నెంబర్ 663 నందు తమకు ఆరు ఎకరాల స్థలం కేటాయించిందని, అందులో నుంచి మా గ్రామస్తులకు బంజారా భవన్, సేవాలాల్ మందిరం కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, నేలకొండపల్లి తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
చింతకాని మండలం పందిళ్ళపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రియ అనంతసాగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 181 లో వ్యవసాయ భూమి ఉందని, సర్వే నెంబర్ 182 లో ఉన్న మరో ఎకరం భూమి కూడా తాము వారసత్వంగా సాగు చేసుకుంటున్నా మని, తమ పట్టా పాస్ పుస్తకంలో ఆ భూమి వివరాలు కూడా నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, చింతకాని తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








