పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు నల్లేరుపై నడకే..
గతంలోనే గెలుపు దగ్గరకు వచ్చి ఆగిన మల్లన్న..
ఓట్ల చిలికనే నాడు ఓటమి..
నేడు ఉమ్మడిగా మల్లన్నకు మద్దతు..
నిరుద్యోగుల కోసం ప్రశ్నించే గొంతుకగా మారేనా..
ఖమ్మంలో పట్టభద్రులు మల్లన్న వైపే..
ఖమ్మంలో మెజారిటీయే లక్ష్యంగా మంత్రులు బట్టి ,తుమ్మల , పొంగులేటి సమీక్షలు..
నేటి గదర్,మే 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
తెలంగాణలో మరో ఎన్నిక సిద్ధం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు,వెంటనే పార్లమెంట్ ఎన్నికలు అలా పూర్తి అయ్యయో లేదో తాజాగా మే 27న నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టభద్రులకు దగ్గరయేలా సన్నాహాలు చేస్తున్నాయి . 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామాతో నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. 2021 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిలో ఓటమి పాలయ్యారు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉండడం ఆయన గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ నడుస్తోంది.. మల్లన్నకు పట్టభద్రులలో మొదటి నుండే మంచి ఫాలోయింగ్ ఉండడం ,ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న పోటీలో ఉండడంతో ఆయన గెలుపు సునాయాసనమే .గతంలో బరిలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పట్టభద్రుల దగ్గరకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ దగ్గరయ్యాడు . ఇప్పుడు అవే విజయ అవకాశాలకు బాటలుగా మారుతున్నాయి. ఇక ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువే .. ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు బట్టి విక్రమార్క ,తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాగూ ఉండనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు పడేలా కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న మల్లన్న కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో తనకు ఎలాగైతే అండగా నిలిచారో. ఇప్పుడు కూడా అదే విధంగా అండగా నిలబడాలని కోరారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో ఎలాగైనా ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ సాధించేలా పట్టభద్రులతో మమేకం అవుతున్నారు. ఎలా చూసినా తీన్మార్ మల్లన్నకు ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది.