*గిరిజన బిడ్డ విజయలక్ష్మికు డాక్టరేట్*
◆కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా
◆PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం
నేటి గదర్,మే 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు…..మహా పురుషులవుతారు….అన్నాడో సినీకవి. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చనే ఇప్పటికే పలువురు నిరూపించారు. ఈ కోవా కే చెందుతుంది సామాజిక ఉద్యమ నాయకురాలు Dr.విజయలక్ష్మి.ఖమ్మం జిల్లా
కూసుమంచి మండలం గైగోళ్లపల్లి పంచాయతీ శివారు గ్రామమైన హత్యతండాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిరిజన నాయకుడు బాదావత్ లక్ష్మణ్ నాయక్ సతీమణి, సామాజిక ఉద్యమ నాయకురాలు విజయలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగంలో డా. ధర్మా నాయక్ పర్యవేక్షణలో “తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవా యొక్క సర్వీసుల ద్వారా వినియోగదారుల సంతృప్తి” అనే అంశం మీద చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. బోడియతండాలో ఒక వ్యవసాయ కుటుంబంలో భూక్య లాడియా వీరమ్మ దంపతులకు జన్మించిన భుక్యా విజయలక్ష్మి ప్రాథమిక విద్యను బోడియతండా ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత విద్యను 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వస్తూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రజ్ఞ స్కూల్ లో, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఖమ్మంలోనే వాణి జూనియర్ కళాశాల, ఆర్.జె.సి డిగ్రీ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ హైదరాబాద్ లో ఎం.కాం. పిజిను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ డిగ్రీ కూడా సాధించారు. నేడు అదే యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యాక వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ తన కర్తవ్యాన్ని మరిచిపోకుండా PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో విజయలక్ష్మి మాట్లాడుతూ నా పరిశోధనకు సహాయపడ్డ నా కుటుంబ సభ్యులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు..