నేటి గదర్ న్యూస్ , వైరా ప్రతినిధి :
వైరా పట్టణం లో కేవీసీఎం డిగ్రీ కాలేజీ మరియు ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రిఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
ఆ విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం వైరాలో మూతపడి ఉన్న కేవీసీఎం డిగ్రీ, ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాలను, పరిసరాలను సందర్శించి పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన వైరాలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.
వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు నిర్మించే వరకు వేచి చూడకుండా వెంటనే ప్రైవేట్ భవనాల్లో నైనా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు సూచించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగారు. ఈ వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేందుకు సేకరించిన రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలోని స్థలాన్ని ముందుగా పరిశీలించారు. ఈ స్థలంలో ఆసుపత్రి భవనాలు నిర్మించేందుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని అప్పటివరకు వేచి చూడకుండా ఈ ఆసుపత్రిని ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది.
ప్రైవేట్ భవనాలకు బదులు గత పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంటున్న కేవీసీఎం విద్యాసంస్థల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే విశాలమైన ఆవరణం, పక్కాగా ఉన్న భవనాల్లో ఎలాంటి అద్దెలు లేకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ఉంటుందని, రోగులకు సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని భావించి ఈ విద్యాసంస్థలను పరిశీలించిన ఎమ్మెల్యే తదితరులు ఇక్కడే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది జూలైలో వైరా కు వంద పడకల ఆసుపత్రి మంజూరైంది. డాక్టర్లు సహా సిబ్బంది మొత్తం 98 పోస్టులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను కూడా కేటాయించింది.
ఇప్పటికే ఈ కేవీసీఎం విద్యాసంస్థలను విద్యావసరాల నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేయటానికి యాజమాన్యం నిర్ణయించి ప్రతిపాదించింది. వెంటనే వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి శాశ్వత భవనాల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆసుపత్రిని అక్కడకు తరలించే విధంగా చర్చలు జరిపి నిర్ణయించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. వేణు, వైరా పిహెచ్సి డాక్టర్ తాతా ఉదయలక్ష్మి, వైరా, కొణిజర్ల మండల కాం గ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, నాయకులు దాసరి దానియేలు, ఏదునూరి సీతరాములు, పమ్మి అశోక్, వల్లపు కొండలు, సూర్యదేవర శ్రీధర్, మల్లు రామకృష్ణ, మూడుముంతల గంగరాజు , పాలేటి నరసింహారావు, పఠాన్ జాన్ తదితరులు పాల్గొన్నారు.