– రూ.30 కూలీ ఏందంటున్న Egs కూలీలు?!
– మసి పూసి మారేడు కాయ చేసే పనిలో అధికారులు..?
– కొత్త అధికారి తోనే సమస్య మొదలైందా..?
గద్దర్ న్యూస్, ఏప్రిల్ 23, భద్రాద్రి కొత్తగూడెం (ప్రతినిధి) : (✍️ అలవాల వంశీ)
బూర్గంపాడు మండల పరిధిలోని జరుగుతున్న కరువు పనిలో కొందరు అధికారుల పనితనం వల్ల కళ్లిపెళ్లి మొదలవుతుందని విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. రైతువారి పనులు లేని సమయంలో కూలీలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNR EGS) బూర్గంపాడు మండలంలో నవ్వుల పాలు అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉదయాన్నే ఏడు గంటలకు పలుగు, పారా.. భుజాన వేసుకొని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధి హామీ పనికి ఆటోకి కిరాయి ఇచ్చుకొని వెళ్లి ఎర్రటి ఎండలో పనిచేస్తే రోజుకు 30 రూపాయలు కూలీ వస్తుందంటే ఉపాధి హామీ పథకం అధికారుల తీరు తేటతెల్లమవుతుంది. మండల పరిధిలోని నాగినేని ప్రోలు పంచాయతీలో ఉపాధి హామీ అధికారుల సొంత తెలివితేటలు కూలీలకు శాపంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 40 రూపాయలు కిరాయి పెట్టుకొని ఉపాధి హామీ పనికి వెళితే.. రోజుకు 30 రూపాయలు కూలీ రావడంతో కూలీలు షాక్ అయ్యారు. వారం రోజులు పనిచేస్తే.. ఆ వారానికి గాను సుమారు 400 రూపాయల కూలీ వచ్చిందంటూ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేస్తే ఎంత కూలీ పడుతుంది అని వివరించి పని చేయించాల్సిన అధికారులు.. ఆ విషయం పక్కన పెట్టి, పనికి రాని వారికి కూడా హాజరు వేస్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు. పనిచేసిన కూలీలకు 30 రూపాయలు వస్తుంటే, పనిచేయని కూలీలకు హాజరు వేస్తూ పని చేయని వారికి సైతం కూలీ డబ్బులు అందిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనిచేసిన ఉపాధి హామీ కూలీల కష్టాన్ని కొందరు అధికారులు పనిచేయని వారికి దోచిపెడుతున్నారని వాపోతున్నారు. కూలీలకు కనీస సదుపాయాలు సైతం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్నప్పటికీ పని ప్రదేశంలో కనీసం టెంట్ కూడా వేయడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఎండలోనే ఉండాల్సిన దుస్థితి ఉపాధి హామీ కూలీలకు తప్పడం లేదని వాపోతున్నారు. ఎండ తీవ్రతకు కూలీలకు ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ బాధ్యత అధికారులు తీసుకుంటారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూర్గంపాడు మండలంలో ఇటీవల జరిగిన సామాజిక తనిఖీలో కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆడిటర్లు గుర్తించిన విషయం విధితమే. అవకతవకలకు పాల్పడిన వారికి నోటీసులు కూడా అధికారులు అందజేశారు. అది జరిగి నెలలు గడవకముందే మళ్లీ నాగినేని ప్రోలు పంచాయతీలో తెరమీదకు వస్తున్న ఉపాధి హామీ అవకతవకలు విషయంలో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ నేపద్యంలో ఉపాధి హామీ అవకతవకలపై పూర్తి వివరాలతో నేటి గద్దర్ న్యూస్ వరుస కథనాలు ప్రచురితం చేయనుంది.