నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి యాదాద్రి జూన్ 11:
నైనారపు నాగేశ్వరావు ✍️
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి హైదరాబాద్లో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడే అద్దె ఇంట్లో ఉండేవాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 కుంటల భూమి ఉంది.పోస్ట్ మాస్టర్గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు.అంతే కాకుండా తమ్ముడు కరుణాకర్రెడ్డి తోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి.ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నాడు.ఘటనపై పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే తన భర్త మృతికి ఆడపడుచులు,మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో వారి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు,తమ్ముడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు.అయితే ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే తన భర్త అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య ఆమె బంధువులు తేల్చిచెప్పారు.వారు కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.