రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్(50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులోని ఫైరింగ్ రేంజ్ లో ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ కు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారు ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వటైజ్మెంట్ బోర్డు ను ఢీకొట్టింది.
కారు లో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి. జవహర్ తలకు, ఛాతీలో గాయాలు గాక కారు డ్రైవర్ కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుకే వస్తున్న మేడ్చల్ పి టి సీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామ శివారు లోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.