అఖిల పక్ష సమావేశానికి పిలిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఉండి కూడా రాలేదని..,
కేసీఆర్ బాధపడుతారని కేంద్రమంత్రి సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం మాట్లాడుతూ.. *మనోహర్ లాల్ కట్టర్ వచ్చేది కూడా కిషన్ రెడ్డికి తెలియదా* అని ప్రశ్నించారు. *రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని మోడీ అన్నారని.. అదే ఇవ్వమని అంటున్నామన్నారు.* జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోందని.. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందని ప్రశ్నించారు.
*గండపిండేరం తొడుగుతాం..*
భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్ అని ఆరోపించారు. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే అని మండిపడ్డారు. *మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతా* నన్నారు. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. *39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని* సీఎం తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకుంటానన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చినట్లు తెలిపారు. కులగణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయన్నారు. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయామని విమర్శించారు.
*కేసీఆర్కు బలుపు…*
నేను రాష్ట్రముఖ్యమంత్రిని, కేసీఆర్ను ఓడించింది నేను, *కేసీఆర్ను గుండుసున్నా చేసింది నేను, కేసీఆర్ను బండకేసి కొట్టింది నేను,* అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్కు మించినవాళ్ళు ఎవరున్నారు. కేటీఆర్ స్థాయి ఏంటి, *కేసీఆర్కు బలుపు తప్ప ఏముంది. తండ్రీ కొడుకులకు బలుపు తప్ప ఏముంది..* అసెంబ్లీలో అధికారపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. *వాళ్ళు మూసేసిన ధర్నా చౌక్ మేం తెరిచాం* అన్నారు. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటామని.. సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.
*అది తప్ప ఏం చేయలేదు..*
జీతభత్యాలు తీసుకొని పని చేయని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. పార్టీ నిర్ణయాలు ప్రెసిడెంట్ తీసుకుంటారని.. అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్చ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందని తెలిపారు. *పదేండ్లలో అప్పులు,తప్పులు తప్పా కేసీఆర్ ఏం చేయలేదన్నారు.* అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని దుయ్యబట్టారు. *కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో బయట పెడుతామన్నారు.* కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుర్మార్గులని మండిపడ్డారు. *తెలంగాణలో శవాలు లేస్తున్నాయని తెలియగానే తీన్మార్ డాన్సులు చేస్తున్నారని..* *పంటలు ఎండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయని* విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాధపడాలని.. ఇంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అన్నారు. *రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరని* ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ తలనొప్పులు ఉండకపోయేదన్నారు. *ప్రగతి భవన్కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది ఎవరన్నారు.* కరువు వస్తే ఇంత పంట పండుతుందా అని అన్నారు.