జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్
సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల డిమాండ్
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 05:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే పనుల కోసం పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటున్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమ హాజరు ఆన్లైన్ కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా తీయాల్సిన ఫోటోలు సర్వర్ సమస్యల వల్ల సకాలంలో అప్లోడ్ కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పని చేసినా కేవలం ఫోటోలు ఆన్లైన్ కాకపోవడం వల్లే తమకు రావాల్సిన రోజువారీ కూలీ డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉందని కూలీలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ ఫోటోల అప్లోడింగ్ మరియు నెట్వర్క్ సమస్యలతో సతమతమవ్వడం కంటే గతంలో మాదిరిగానే పాత పద్ధతిలోనే హాజరు నమోదు ప్రక్రియను కొనసాగించాలని కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్త యాప్ విధానం వల్ల పనులు సజావుగా సాగడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిని అమలు చేసి తమకు పని దినాలు మరియు కూలీ నష్టపోకుండా చూడాలని జమ్మిగూడెం గ్రామ ఉపాధి హామీ కూలీలు విన్నవిస్తున్నారు.








