– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం (BHADRACHALAM):
ఆదివాసి గిరిజన రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారస్తులు అధిక శాతం వడ్డీతో పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాగానే వారు నిర్ధారించిన రేటుకి పండించిన పంట తీసుకోవడంతో రైతులు మోసపోతున్నారని, ఈ మధ్య దళారుల భారీ నుండి గిరిజన రైతులను ఆదుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో పినపాక, మణుగూరు తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఐకెపి సిబ్బందితో గిరిజన రైతులకు ఆర్థిక వెసులు బాటు కల్పించి, వారిని వడ్డీ వ్యాపారస్తుల కబంధహస్తాలలో, మధ్య దళారుల ఉచ్చులో పడకుండా కాపాడాలన్నారు. మహిళా సమైక్యల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే గిరిజన రైతులు దుక్కి దున్నుకొని పంటలు వేయడానికి సన్నద్ధమవుతారని అందుకు సంబంధిత ఐకెపి ఏపీఎంలు, సీసీలు మండల సమైక్య సభ్యులు గిరిజన రైతులకు వివో ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తక్కువ వడ్డీతో వారికి ఆర్థిక సహాయం చేసి తిరిగి గిరిజన రైతుల నుండి వసూలు చేసుకునేలా రైతులకు నచ్చ చెప్పాలని ఆయన అన్నారు. మణుగూరు, పినపాక మండలాల్లోని గిరిజన రైతులకు తప్పనిసరిగా సంబంధిత ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత తీసుకొని వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని అన్నారు. గిరిజన రైతులు మాత్రం ప్రైవేటు ఫైనాన్సులు, వడ్డీ వ్యాపారులు, మధ్య దళారులు బారిన పడకుండా చూడాలని గిరిజన గ్రామాలలో మహిళా సమైక్యలకు సంబంధించిన వివోలు గిరిజన రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలు అందుబాటులో ఉన్న చోట గిరిజన రైతులను ఒక దగ్గర సమావేశపరచి వారికి ఎంత డబ్బు అవసరమో అంత వారికి ఇప్పించి పంటలు పండించుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, సురేష్ బాబు, ఏటీడీఓ నరసింహారావు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పినపాక తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.