– అతడిని పోలీసులే అడవిలోకి పంపారు
– CPI(మావోయిస్టు)వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీ
నేటి గదర్, జూన్ 06, డెస్క్ ప్రతినిధి :
ఇటీవల ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోలు అమర్చిన బాంబు పేలి ఇల్లెందుల ఏసు అనే వ్యక్తి మృతి చెందడం పట్ల CPI(మావోయిస్టు)వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీ ప్రకటన విడుదల చేశారు. కాగా కార్యదర్శి శాంతా పేరుతో ఉన్న ఈ ప్రకటనలోని విషయాలు ఈ విధంగా ఉన్నాయి… ఇటీవల జూన్ 3వ తేదీన కొంగాల అడవుల్లో కర్రిగుట్టపై వేట కోసం వెళ్ళి బూజీట్రాప్ ని తొక్కడంతో అది పేలి జగన్నాదపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏను మరణించగా, అతని కొడుకు స్వల్పంగా గాయపడ్డ పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదులకు, కార్పోరేట్లకు ప్రయోజనాల కోసం అడవులను కట్టపెట్టడానికి స్థానిక ప్రజలకు అడవులపై ఎలాంటి హక్కులు లేకుండా చేసి ఆదివాసులను అడవుల నుండి తరిమి వేయాలనే పథకం రూపొందించారని ఆరోపించారు. కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై, ప్రజలపై దాడులు చేస్తూ నరసంహరం కొనసాగిస్తూ ప్రజల్లో భయంకర పరిస్థితులు కల్పిస్తున్న విషయం ప్రజలందరికి తెలిసిందేనని పేర్కొన్నారు. అందులో భాగంగానే వాజేడు-వెంకటాపురం ఏరియాలో కూడా మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో దాడులు కొనసాగుతున్నాయని, మా దళాల సమాచారం కోసం కొద్దిమంది లంపెన్ సెక్షన్ ను స్వల్ప ఆర్థిక ప్రయోజనాలతో ప్రలోభ పెట్టి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. వేటగాళ్ళ వేషంలో ఇన్ఫార్మర్లకు సెల్ పోన్ లు ఇచ్చి అడవుల్లోకి పంపుతున్నారని, వీరిచ్చే సమాచారం ఆధారంగా తెలంగాణ గ్రేహౌండ్స్, చత్తీష్ గడ్ పోలీసులు కలిసి నిరంతరం కూంబింగ్ లు చేపడుతున్నారని, మార్చి 6వ తేదీన వేటగాళ్ళ రూపంలో అడవుల్లోకి వచ్చిన ఇన్నార్మెర్లు ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు పిట్టపడా అడవుల్లో మా దళంపై చేసిన దాడిలో మా సహచర కామ్రేడ్స్ అన్నే సంతోష్ (సాగర్)తో పాటు, మనీరామ్, లక్ష్మణ్ లు అమరులయ్యారని ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటన తరువాత మరింత కూంబింగ్స్ ను పెంచి అడవులను జల్లెడ పడుతూనే ఉన్నారని, మా ఆత్మరక్షణ కోసం ప్రజలు నిత్యం పనులు చేసుకునే స్థలాల్లో కాకుండా ప్రజలు తిరగని ఎత్తైన కొండలపై అనేక ట్రాపులను ఏర్పాటు చేసిన విషయం పరిసర ప్రాంతాల్లో వున్న ప్రజలందరికి అడవుల్లో రాకుడదని తెలియ చేసామని ప్రకటనలో తెలిపారు. దానితో ప్రజలు ఎవరు అడవుల్లోకి వెళ్ళడం లేదని, కాని పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీ దళాల సమాచార సేకరణతో పాటు, పోలీసులు కూంబింగ్ కు వెళ్ళే దారులను క్లీయర్ చేయడానికి వేట పేరుతో కొద్ది మంది అమాయక ప్రజలను అడవుల్లోకి పంపి తమ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లెందుల ఏసును పోలీసులే మా సమాచారం కోసం పంపించారని, అతను మరణించిన తరువాత ఈ ఘటనకు భాద్యలైన పోలీసులే ఎలాంటి భాధ్యత వహించకుండా మావోయిస్టు పార్టీపై తోసే ప్రయత్నం చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు పోలీసులే పూర్తి భాద్యత వహించాలని, ఘటనను సాకుగా చూపి మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబాలను, కొద్ది మంది పని పాట లేని లంపెన్ సెక్షన్ యువకులను కూడకట్టి వారి ద్వారా ధర్నాలు చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అనుసరిస్తున్న మోస పూరిత విధానాలను వ్యతిరేకంచమని ఇల్లెందుల ఏసు కుటుంబానికి, ప్రజలకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక, అభివృద్ధి నిరోధక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ప్రజలపై, మావోయిస్టు పార్టీపై విప్లవ ప్రతిఘాతుక వ్యూహాత్మక కగార్ పేరుతో నిర్ణయాత్మక దాడిని కొనసాగిస్తున్నారని, ఈ ఐదు నెలల కాలంలో కగార్ పేరుతో పదుల సంఖ్యలో సాధారణ ప్రజలను చంపి నరసంహారం సృష్టించారని, దీనితో అనివార్యంగా ప్రజలను యుద్ధంలోకి దింపుతున్నారని ప్రకటనలో అన్నారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు నేడు కౄరమైన కగార్ దాడిని వ్యతిరేకంగా పోరాడక తప్పని స్థితి ఏర్పడిందని ప్రకటనలో పేర్కొన్నారు.