రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గారితో ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు.
✳️ ఈ ఏడాది హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వంటి వేదికల వివరాలను ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
✳️ దౌత్య సహకారంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్ విజయవంతం అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో నిర్వహించే భారత కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్కు తగినంత ప్రచారం, ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు.
✳️ ముఖ్యమంత్రి గారి అభ్యర్థన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న హైదరాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు విదేశీ వ్యవహారాల శాఖ మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి గారు తెలియజేశారు.
✳️ కేంద్ర మంత్రి జైశంకర్ గారితో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి గారి వెంట కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు.