నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 31: అశ్వారావుపేట రాజకీయాల్లో ఊహాగానాలు, కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ముఖ్యంగా అశ్వారావుపేట జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీటీసీ, మహిళా నాయకురాలు వేముల భారతిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో మంచి పేరు ఉన్న, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేముల భారతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె తన ఎంపీటీసీగా ఉన్న సమయంలో ప్రజలతో సన్నిహితంగా మెలగడం, అనేక సమస్యలపై పోరాడటం ఆమెకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. కరోనా కష్టకాలంలో నిస్వార్థ సేవ: వేముల భారతి ప్రజాదరణ కేవలం రాజకీయ పదవుల వల్ల వచ్చినది కాదు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె ప్రాణాలకు తెగించి ప్రజలకు చేసిన సేవలు అశ్వారావుపేటలో ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. లాక్డౌన్ కష్టకాలంలో ఎంతోమంది పేదలకు, వలస కార్మికులకు ఆమె స్వయంగా ఆహారం, నిత్యావసరాలు అందించారు. ఆమె గ్రామాల్లో పర్యటించి, కరోనా బారిన పడిన వారికి మందులు, ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఆమె చేసిన ఈ నిస్వార్థ సేవలు ప్రజల మదిలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. ఈ విశ్వసనీయత, ప్రజలకు ఆమెపై ఉన్న నమ్మకం ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లుగా మారే అవకాశం ఉంది. భారతికి అనుకూలించే అంశాలు: వేముల భారతి చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకులతో పాటు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, జడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర కీలకం కాబట్టి, ఆయన మద్దతు కూడా ఆమెకు కలిసివస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కూడా ఆమెకు ఫస్ట్ నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయనే స్వయంగా ఆమె పేరును జడ్పీటీసీ రేసులో పరిశీలించాల్సిందిగా స్థానిక నాయకులకు సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో ఆమెకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. మహిళా సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటారు. అంతేకాకుండా, దిశా ప్రొటెక్షన్ ఫోర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలిగా మహిళల భద్రత, హక్కుల కోసం ఆమె చేసిన కృషి అశ్వారావుపేటలో ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపును ఓట్లుగా మార్చుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పార్టీలో వ్యూహాత్మక అడుగు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కొత్త వారికి అవకాశం ఇస్తూనే, మరోవైపు పాత నాయకులను విస్మరించకుండా సమతుల్యం పాటించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వేముల భారతిని బరిలోకి దింపడం ద్వారా బీసీ వర్గాల మద్దతును కూడగట్టుకోవచ్చని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, అశ్వారావుపేట జడ్పీటీసీ రేసులో వేముల భారతి పేరు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తే, స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే, పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.









