ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన
మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో ఎన్నికల వేళ పంపిణీ చేసిన ‘నజరానాల’ పర్వం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గతంలో ప్రతి ఇంటికీ ఒక ప్రెషర్ కుక్కర్తో పాటు ఓటుకు రూ. 2500 చొప్పున పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, పోలింగ్ ముగిసిన అనంతరం తాను ఓడిపోతాననే భయం పట్టుకోవడంతో, సదరు నేత తన అనుచరులతో కలిసి ఓటర్ల ఇళ్లకు వెళ్లి “మాకు ఓటు వేయలేదని సమాచారం ఉంది, కాబట్టి మేము ఇచ్చిన కుక్కర్లను, డబ్బును తిరిగి ఇచ్చేయాలి” అని హుకుం జారీ చేశారు. ఈ వింత ధోరణికి నిరసనగా పదో వార్డు ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కుక్కర్లన్నింటినీ రోడ్డుపైకి తీసుకువచ్చి రాస్తారోకో నిర్వహించారు. “ఓటు వేయలేదన్న నెపంతో ఇచ్చిన వస్తువులను వెనక్కి అడగడం మా ఆత్మగౌరవాన్ని కించపరచడమే” అని మండిపడ్డ ఓటర్లు, కౌంటింగ్ కంటే ముందే తమను దోషులుగా నిర్ధారించడంపై అసహనం వ్యక్తం చేస్తూ కుక్కర్లను అక్కడే పడేసి వెళ్లారు.








