అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు 14వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని భుక్య ఉదయజ్యోతి గెలుపును కాంక్షిస్తూ జిల్లా నాయకులు సోయం వీరభద్రం ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, విజ్ఞులైన ఓటర్లు ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించి, అభివృద్ధిని విస్మరించిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని, బీఆర్ఎస్ అభ్యర్థులకు వస్తున్న భారీ మద్దతు చూస్తుంటే విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అశ్వారావుపేట ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సర్పంచ్లు సోయం సత్యవతి, కొమరం సుశీల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఉప్పలపాటి వెంకటరమణ, రావు జోగేశ్వరరావు, కోర్సా వెంకటేష్, బాషా సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.








