బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊహించని మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ముఖ్యంగా 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సంకుల స్వరూపకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను సహించేది లేదని వెంకటరమణ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అశ్వారావుపేటలో ఇది కేవలం ఎన్నిక కాదు, అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఇక్కడ దొరల పెత్తనం సాగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. 13వ వార్డులోని గొల్ల కురుమ సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావడంతో సంకుల స్వరూప 400 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, అధికార బలాన్ని ప్రయోగించినా అశ్వారావుపేటలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం చారిత్రక అవసరమని, ప్రజలు బ్యాలెట్ బాక్సుల ద్వారా గడీల పాలనకు చరమగీతం పాడనున్నారని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ భారీ మద్దతు చూస్తుంటే, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది.








