టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీల ఉమ్మడి ప్రచారం శనివారం అత్యంత ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో 8, 18, 6, 3, 1 వార్డులలో నిర్వహించిన ఈ ‘గడప గడపకు ప్రచారం’లో బిఆర్ఎస్, టిడిపి కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కదం తొక్కారు. ఇంటింటికీ వెళ్తూ ప్రజల ఆశీస్సులు కోరిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అబద్ధపు గ్యారెంటీలతో మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, కేవలం బిఆర్ఎస్ పార్టీ వల్లే పట్టణాల అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపాలిటీ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి బలం అజేయమని, క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులకు ఘనస్వాగతం పలుకుతూ ప్రచార జోరును పెంచారు.








