ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్భందం.
– అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి.
ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస్ రావు ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాలను ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాలతో ఖాళీ చేయించడం సరైంది కాదన్నారు.పేదల నివాస హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం, వారి ఇళ్లను కూల్చివేసి రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులను అరెస్ట్ చేసి నిర్భందించడం సరైన కాదన్నారు.
ఇదే సమయంలో కొంతమంది అరాచక శక్తులు ఈ ఇళ్ల సమస్యను ఆసరాగా చేసుకుని పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న అలాంటి వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, భూక్యా శ్రీనివాస్ రావు, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు కూచిపూడి నరేష్, వడ్లముడి నాగేశ్వరరావు, మల్లికార్జున్ రెడ్డి, కొండం కరుణాకర్, పి సుభాష్, నల్లమల్ల సత్యనారాయణ, జట్ల ఆనందరావు పోటు హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.








