**పరిపాలనలో ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్*
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగం ద్వారా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లో పరిపాలనలో ఏఐ సాంకేతికత క్లాడ్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎక్సెల్ లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే అంశంపై జిల్లా అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగం వల్ల మన పని మరింత మెరుగ్గా, వేగంగా పూర్తి చేసే అవకాశం ఏర్పడిందని, దీనిని ప్రతి ఒక్క అధికారి వినియోగించుకోవాలని అన్నారు. క్లాడ్ తో నివేదికలు వేగంగా తయారు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
*క్లాడ్* అనే ఏఐ ద్వారా ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మెరుగ్గా తయారు చేసుకోవచ్చని తెలిపారు. మనకు ఎటువంటి ప్రెజెంటేషన్ కావాలో చెబితే క్లాడ్ వేగంగా తయారు చేస్తుందని, ఎక్సెల్ లో అవసరమైన ఫార్ములా వినియోగిస్తూ మంచి విశ్లేషణ మన ముందు ఉంచుతుందని అన్నారు.
ధాన్యం కొనుగోలు సంబంధించి గత 5 సంవత్సరాల వివరాలు అప్ లోడ్ చేస్తే అధికంగా పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్ల జాబితా క్షణాల్లో అందిస్తూ మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలో త్వరగా చెబుతుందని అన్నారు. 2 నుంచి 3 గంటల పాటు సమయం తీసుకునే పనులు క్లాడ్ వినియోగం ద్వారా నిమిషాల వ్యవధిలో పూర్తి అవుతుందని అన్నారు.
ప్రతి శాఖకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతి, సిబ్బంది పని తీరు పర్యవేక్షణలో కూడా క్లాడ్ ను వినియోగించాలని అన్నారు. క్లాడ్ చేసే పని మనం ఎల్లప్పుడూ సూపర్ వైజ్ చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి చేయవచ్చని అన్నారు.
ఏఐ టూల్స్ వాడుతూ మన కార్యాలయ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఏఐ టూల్స్ ఉపయోగం ద్వారా తక్కువ సమయంలో మరింత మెరుగ్గా పని చేయవచ్చని, దీనిపై జిల్లా అధికారులు అవగాహన పెంచుకొని సిబ్బందికి నేర్పించాలని కలెక్టర్ తెలిపారు.
ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా మన అవసరాలకు తగ్గట్టుగా యాప్ లను కూడా తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఏఐ సాంకేతికత క్లాడ్ ను ప్రతి కార్యాలయంలో వినియోగించాలని, వచ్చే వారం ఏ విధంగా క్లాడ్ ను తమ శాఖలో వాడవచ్చు అనే అంశంపై కనీసం ఇద్దరు జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందించాలని అన్నారు.
ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులకు త్వరితగతిన చేర్చడంలో, శాఖాపరంగా పథకాల అమలు సమర్థవంతంగా జరిగేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఏఐ సాంకేతికత క్లాడ్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








