అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా ఆగడాలు మిన్నంటుతున్నాయి. వినాయకపురం గ్రామ పరిసరాల నుండి అశ్వరావుపేట పట్టణానికి జెసిబిల సహాయంతో పగలు, రాత్రి తేడా లేకుండా గ్రావెల్ మట్టిని యథేచ్ఛగా తవ్వుతూ, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దందా వల్ల ప్రకృతి సంపద కొల్లబోవడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది, పచ్చని పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. అధికారుల కళ్లముందే ఇంత భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా వారు పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విచారణ చేపట్టి ఈ అక్రమ తవ్వకాలను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పౌరులు డిమాండ్ చేస్తున్నారు.








