మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కౌన్సిలర్ అభ్యర్థిని భూక్య ఉదయజ్యోతి
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వరావుపేట 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని భూక్య ఉదయజ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం గాండ్లగూడెం మరియు అనంతారం గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు అపురూప సత్కారం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక మహిళా సర్పంచ్లు, వార్డు మెంబర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి, చీరలను బహుకరించి గౌరవించారు. అనంతరం మహిళలంతా మిఠాయిలు పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయజ్యోతి మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని కొనియాడారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ భూక్య ప్రసాద్ తో పాటు పార్టీ కార్యకర్తలు నవీన్, వంశీ నాయక్, శ్రీను, రమేష్, శివాజీ, కనకారావు, శోభన్, వినోద్, కిషోర్, సుధాకర్, వెంకటేష్, రాంజీ, బదియ, గాంధీ తదితరులు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావం ప్రకటించారు.









