◆ఎంపీ వద్దిరాజు కేంద్ర బడ్జెట్ పై స్పందన
నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
పార్లమెంట్ లో వరుసగా 8వ సారి జాతీయ బడ్జెట్ (కేంద్ర బడ్జెట్)ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కు హృదయపూర్వక అభినందనలు.ఈ ఆర్థిక (2025-26) సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 50 లక్షల 65వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టినా ఇందులో తెలంగాణకు ఒక పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం.ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని మరోసారి తీవ్ర నిరాశపర్చింది.అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు.బీహార్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటును ప్రకటించి, తెలంగాణలోని మామూనూర్ పునరుద్ధరణ, కొత్తగూడెం, ఆదిలాబాద్ లలో విమానాశ్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం తీవ్ర అభ్యంతరకరం.వీటి విషయమై పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడును స్వయంగా కలిసి వినతిపత్రమిచ్చి కోరడం జరిగింది.అయినా కూడా ఈ విమానాశ్రయాల ఏర్పాటు గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం అన్యాయం.పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ ను పెడచెవిన పెట్టడం శోచనీయం.బీఆర్ఎస్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM), మరికొన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లు,సైనిక్ స్కూల్స్,కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ పాఠశాలల ఏర్పాటు ప్రస్తావనే లేకపోవడం శోచనీయం.ఈ బడ్జెట్ లో రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చి మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించడం సంతోషకరం.నిర్మలమ్మకు తెలంగాణతో సత్సంబంధాలు ఉండి కూడా బడ్జెట్ లో ఈ విధంగా వివక్ష చూపడం తీవ్ర విచారకరం.
-వద్దిరాజు రవిచంద్ర MP (రాజ్యసభ),బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్.