కథల, కవితల విజేతలకు పురస్కారాల ప్రదానం
విజేతల రచనల సంపుటి ఆవిష్కరణ
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం, ఫిబ్రవరి 9 ః
ప్రముఖ సాహితీ సంస్థ అక్షరాలతోవ సాహితీ సంస్థ ఏడవ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మంలోని జెడ్పీ మీటింగ్హాల్లో అక్షరాలతోవ నిర్వాహకులు నామా పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన కథల, కవితలతో ప్రచురించిన పుస్తకాన్ని రిటైర్డ్ హెచ్ఎం, పరిశ సీతారత్నం ట్రస్ట్ వ్యవస్థాపకులు పరిశ పుల్లయ్య, స్పర్శ సామాజిక అధ్యయన కేంద్రం ఛైర్మన్ స్పర్శ భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం సభలో పరిశ పుల్లయ్య, భాస్కర్ మాట్లాడుతూ సమాజంలో మార్పులను గమనిస్తూ పీడితుల పక్షాన నిలిచే కవిత్వాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ పరిశీలనను పెంపొందించే రచనలు రావాలన్నారు. సామాన్యుల పక్షాన కవిత్వ నిలవాలన్నారు. సమాజహితాన్ని కోరుతూ సాహిత్య సేవ చేస్తున్న అక్షరాల తోవ సాహిత్య సంస్థను అభినందించారు. జెవివి రాష్ట్ర నాయకులు అలవాల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ను బలపరుస్తూ కవిత్వం రావాలన్నారు. ప్రశ్నించే తత్వాన్ని బలపరచాలన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు సైదులు ఐనాల మాట్లాడుతూ నేర్చుకోవడం, నేర్పడం కవులు చేయాలన్నారు. కవులను ప్రోత్సహిస్తూ ఏడేళ్లుగా అక్షరాల తోవ చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రముఖ రచయిత్రి వురిమళ్ల సునంద, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తాళ్లూరి లక్ష్మీ, ప్రముఖ రచయిత, గాయకుడు యోచన మాట్లాడుతూ అక్షరాలతోవ సాహిత్య సేవను విశ్లేషిస్తూ అభినందించారు. ప్రముఖ సినీ దర్శకులు కొత్తపల్లి శేషు తన ప్రసంగంతో సభను అలరించారు. తెలుగు భాషా గొప్పతనం, అక్షరాల తోవ సాహిత్య సేవను కొనియాడుతూ వినిపించిన కవిత అందరినీ ఆకట్టుకుంది. విజేతల కథల, కవితలతో రూపొందిన పుస్తకాన్ని రాచమళ్ల ఉపేందర్ పరిచయం చేశారు. ఈ సందర్బంగా అక్షరాల తోవ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త అన్నం శ్రీనివాసరావును సన్మానించారు.రెండు తెలుగు రాష్ట్రాల లోనుండి వచ్చిన కథ కవిత విజేతలు స్పందన సభికులను ఆకట్టుకుంది.. అనంతరం కథల, కవితల విజేతలకు పురస్కారం అందచేశారు. ప్రముఖ గాయకులు పాగి వెంకన్న, సత్యానందం, రేళ్ల శ్రీనివాస్, పొట్టేటి వెంకట్రామయ్య, సీత్లానాయక్ గీతాలు అందిరనీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అక్షరాలతోవ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, ప్రముఖ కవులు సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, కంచర్ల శ్రీనివాస్, ఇబ్రహీం నిర్గుణ్, పెద్దోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.









