తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి కారణాలు లేకుండానే పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ జిల్లా నేతలు బానోత్ నరేందర్,మునిగల శివప్రశాంత్,ఎ.పార్థసాథి లతో పాటు ఇతర విద్యార్థి సంఘ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హెయమైన చర్య అని పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు బి.సాయి,పట్టణ నాయకులు అబ్దుల్ గని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే నేడు ప్రజాపాలనంటూ ఊదరగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన నిజస్వరూపం బట్టబయలు అవుతుందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకుల ఇండ్లకు అర్ధరాత్రి సమయంలో వెళ్లి భయభ్రాంతులకు గురిజేస్తూ అనేకమందిని తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ప్రజాపాలన ఎట్లా? అవుతుందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు,ప్రదర్శనలు, నినాదాలు చేయరాదని అప్రజాస్వామికమైన సర్కులర్ తో ఆంక్షలు విధించడం, మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఆక్రమించుకొని కార్పొరేట్ సంస్థలకు దార దత్తాం చేసేందుకు యూనివర్సిటీ విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించి మాట్లాడకుండా గొంతులు నొక్కేస్తున్న క్రమంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల మద్దతు లభిస్తుందనే భయంతోనే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ పోకడలను మానుకొని ఓయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో నిర్బంధ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
