నేటి గదర్ న్యూస్,
హైదరాబాద్:
హైదరాబాద్ నగరానికి చెందిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అక్టోబర్ చివరిలో జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది.ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏర్పాట్లను ప్రారంభించాలని సూచనలు పంపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం ఈ ఎన్నికల నిర్వహణను చేపట్టనుంది. అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది.
ఓటర్ల నమోదుకు గరిష్ఠ ప్రాధాన్యత ఇస్తున్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు కొత్త ఓటర్లను ఫారం-61 ద్వారా నమోదు చేస్తారు. ఇప్పటి వరకు 3,89,954 ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని సమాచారం.
ఈవీఎంల లభ్యత, భద్రతపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చురుగ్గా వ్యవహరిస్తోంది. అవసరమైన 500 యంత్రాలకు బదులుగా జీహెచ్ఎంసీ 1000 ఈవీఎంలను సిద్ధం చేసింది. భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. పోలింగ్, కౌంటింగ్ కోసం సుమారు 1500 మంది సిబ్బంది అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ప్రకారం, ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు ప్రకటించాయి.









