నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 30: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా అశ్వారావుపేటలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల 10, 11 తేదీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలలో పర్యటిస్తున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అశ్వారావుపేటలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్టీఓ కార్యాలయం వంటి అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ నాయకులు, అధికారుల జాబితాను తయారు చేస్తున్నామని, భవిష్యత్తులో వారికి తగిన విధంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత వల్లే స్థానిక ఎన్నికలను పెట్టకుండా ఉందని, కోర్టు ఆదేశాల తర్వాతే ఎన్నికలకు సిద్ధమైందని రేగ కాంతారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందించామని చెప్పారు. ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, జిల్లాకు మెడికల్ కాలేజీలు తీసుకురావడం బీఆర్ఎస్ ఘనత అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లను రాసి పెట్టుకోవాలని, వారిని ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు నిలిచిపోయాయని విమర్శించారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్ కూడా రావడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో 90 శాతం సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బీఆర్ఎస్కే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, ఐదు మండలాల మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు.









