నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.
డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ పాషా.
నేటి గదర్ న్యూస్, వైరా:
డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు ఆగస్టు 31వ తేదీ మంచికంటి భవనంలో ఉత్సాహభరితంగా, జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలో వైరా పట్టణానికి చెందిన షేక్.నాగుల్ పాషా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా, వేము చిన్నబాబు జిల్లా కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభ అనంతరం నూతన జిల్లా ఉపాధ్యక్షుడు షేక్.నాగుల్ పాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం వల్ల యువత విపరీత పరిస్థితుల్లోకి వెళ్తున్నారని, చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యపానం వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్మూలన కోసం పటిష్టమైన చట్టాలు చేయాలని ఆయన సూచించారు. ఈ మహాసభలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, సమాజంలో పెరుగుతున్న గంజాయి, మద్యపానం వాడకాన్ని నిర్మూలించేందుకు చట్టాలు ఏర్పాటు చేయాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని పలు తీర్మానాలను ఆమోదించారని తెలిపారు. మహాసభలో ఆమోదించిన తీర్మానాలను భవిష్యత్తు కార్యాచరణగా తీసుకొని, యువతను సమరశీల పోరాటాల్లో భాగస్వామ్యం చేస్తూ యువతను సరైన మార్గంలో నడిపించేందుకు డివైఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.









