అశ్వరావుపేట నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గం, చంద్రుగొండ మండలం, బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామానికి చేరుకున్న సీఎంకు ఆదివాసీ నృత్యాలతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త ఇందిరమ్మ ఇళ్లను సీఎం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిరుపేదలకు సొంతిళ్లు అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. “ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ ముగ్గురు మంత్రులను నియమించాం. ఆర్థిక శాఖ బాధ్యత కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తికే అప్పగించాం. కాబట్టి ఈ జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. రాజ్యసభ సీటు కూడా రేణుకా చౌదరికి ఇచ్చాం,” అని ఆయన గుర్తు చేశారు.
పేదరికంపై పోరాటం
ధరణి ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదలకు గృహప్రవేశాలు కల్పించామని, వారి కళ్లలో ఆనందం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించిందని చెప్పారు. పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించేది కాంగ్రెస్ పార్టీ అని, ఇందిరమ్మ పాలనలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటివి అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తోందని, భూములు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు.
విద్యకు ప్రాధాన్యత
“పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడు. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది,” అని సీఎం అన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెలు పెంచుకోవాలని చెప్పేవారని, కానీ ఇప్పుడు పేదవాడు కూడా డాక్టర్ కావాలని, చదువుకోవాలని ఆకాంక్షించారు. అందుకే తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
సమస్యల పరిష్కారం
రాబోయే పది రోజుల్లో జిల్లాలోని సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూర్చొని చర్చిస్తామని సీఎం తెలిపారు. అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.
గృహ నిర్మాణాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సంవత్సరానికి రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుందని, ప్రభుత్వం ఉన్నంత వరకు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. “2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ప్రతి పేదవాడికి కచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లు ఉండేది,” అని ఆయన అన్నారు.









