జూపల్లి యువసేన కైవసం చేసుకున్న లడ్డూ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 6: అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట పంచాయతీలోని రామాలయం ప్రాంగణంలో గొల్లపల్లి వెంకన్నబాబు – గొల్లపల్లి నరసింహారావు (బ్రదర్స్) విగ్రహ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామాలయం అర్చకులు రమేష్ చంద్ర పర్యవేక్షణలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు విశేషంగా పూజలందుకున్న గణపతి చేతిలోని లడ్డూను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపారు. గణపతి చేతిలోని లడ్డూను దక్కించుకోవడం వల్ల విశేష శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ లడ్డూ ప్రసాదాన్ని తమ వ్యవసాయ భూమిలో లేదా వ్యాపార సంస్థలలో ఉంచుకోవడం, బంధుమిత్రులకు ప్రసాదంగా ఇవ్వడం ద్వారా అదృష్టం వస్తుందని వారు నమ్ముతారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున నిర్వహించిన లడ్డూ వేలం పాటను జూపల్లి యువసేన సభ్యులు అత్యధికంగా ₹21,116కు పాడి, లడ్డూను కైవసం చేసుకున్నారు. తమ అభిమానంతో లడ్డూ ప్రసాదం దక్కినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.









