నాయక పోడుల ‘యువ గర్జన’: ప్రత్యేక సీరియల్ నెంబరు, నిధులు కేటాయించాలని డిమాండ్
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో నాయక పోడు కులస్తులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున గళం విప్పారు. దమ్మపేట లో ఆదివారం నాయక పోడుల ఆధ్వర్యంలో ‘దేవుళ్ల సమ్మెలన’ కార్యక్రమం పేరుతో ‘యువ గర్జన’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నాయక పోడు కులస్తులు తమ కుల దేవతలతో కలిసి దమ్మపేటలోని తాహసీల్దార్ కార్యాలయం దగ్గర నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ నెమలిపేట వరకు సాగింది, అక్కడ వారు ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో నాయకులు మాట్లాడుతూ, చారిత్రక ఆధారాలను ఉదహరించారు. 1949లో నిజాం నవాబు హయాంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తమను నాయక పోడు తెగగా ప్రత్యేకంగా గుర్తించారని గుర్తు చేశారు. అయితే, 1950 సంవత్సరంలో ప్రకటించబడిన గిరిజన తెగల జాబితాలో తమను గోండులలో ఉప తెగగా కలిపి చూపించారని, కొత్తగా ఆంద్ అనే తెగను మాత్రం గిరిజన జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గోండు జాతిలో కలపడం వల్ల నాయక పోడు జాతి అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేకపోయిందని, తాము వెనుకబడి ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు. తమకు సపరేట్ సీరియల్ నెంబరు కేటాయించడం ద్వారా విద్యా, వైద్యం, ఉపాధి వంటి ప్రభుత్వ ఫలాలు నేరుగా తమ తెగకు అంది, నాయక పోడు జాతి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నాయక పోడుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. కాబట్టి, పూర్తిగా వెనుకబడి ఉన్న నాయక పోడు కులానికి ప్రత్యేక సీరియల్ నెంబరు కేటాయించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









