నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట
యోధురాలు వంకాయలపాటి సుగుణమ్మ (92) ఆదివారం మరణించారు. మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన సుగుణమ్మ భర్త వంకాయలపాటి సీతయ్య సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా -పనిచేశారు. సుగుణమ్మ రెండు సార్లు ఖమ్మం సమితి సభ్యురాలిగా పనిచేశారు. తుది శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ -సభ్యురాలిగా సుగుణమ్మ కొనసాగారు. సుగుణమ్మ జాతీయ మహిళా సమాఖ్య ఖమ్మం జిల్లా నాయకురాలిగా రెండు దశాబ్దాల కాలం పాటు వివిధ హోదాలలో పని చేశారు. ఆమె కుమారుడు వంకాయలపాటి సత్యనారాయణ సిపిఐ నుంచి ఎంపిటిసిగా పనిచేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి -సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ సుగుణమ్మ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. నిబద్దత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయామని వారు సంతాప సందేశంలో పేర్కొన్నారు. సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి సుగుణమ్మ మృతదేహాన్ని సందర్శించి అరుణ పతాకాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, మండల నాయకులు తాళ్లూరి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు రంగారావు తదితరులు ఉన్నారు.









