డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు; రైతులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మల్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మల్కారం గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో వ్యవసాయ మార్కెట్కు అనుసందానంగా ఈ కేంద్రాన్ని డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి మాట్లాడుతూ మల్కారం పరిధిలోని రైతులు ఇబ్బందులకు గురికాకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు అన్నివేళలా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున మండల పరిధిలో అన్ని విధాల సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రైతులు తమ ధాన్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, వారు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డ్వాక్రా మహిళలు, మల్కారం ఉమ్మడి పంచాయతీ రైతులు, స్థానిక రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









