పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి…. సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొన్న సాధారణ ఎన్నికల పరిశీలకులు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు.
సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించి మండలాల వారీగా సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. 200 ఓటర్ల వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 1 పిఓ, 1 ఓపిఓ , 201 నుండి 400 ఓటర్ల వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 1 పిఓ, 2 ఓపిఓలు, 401 నుండి 650 ఓటర్ల వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 1 పిఓ, 3 ఓపిఓ లతో బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ చేసామని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించు కునేందుకు 20 శాతం సిబ్బందిని రిజర్వ్ లో ఉంచడం జరిగిందని, మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు 20 శాతం సిబ్బంది రిజర్వ్ కలిపి 1899 పోలింగ్ అధికారులు, 2321 ఓపిఓ లను నియమించామని తెలిపారు. 235 పోలింగ్ కేంద్రాలలో ఉన్న 1740 పోలింగ్ స్టేషన్ లలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సిబ్బంది సకాలంలో హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి టి. సునీల్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారిణి చైతన్య జైని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









