ఫుట్ బల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి పర్యవేక్షించారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ—
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు హైదరాబాద్కు రానుండగా, వారికి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ భద్రతా, లాజిస్టిక్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్టేడియంలో భద్రత, పార్కింగ్, ప్రేక్షకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సరైన విధంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మ్యాచ్ సందర్భంగా మెస్సి ప్రయాణ మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఇతర విఐపీల రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలను సమీక్షించారు. రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లు భద్రతా ఏర్పాట్లను నేరుగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్న వేళ, మెస్సి మ్యాచ్ కూడా హైదరాబాద్ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. అభిమానులు నిర్ణయించిన సమయానికి ముందే స్టేడియానికి చేరుకోవాలని కూడా సూచించారు.
ఈ సమీక్షలో అదనపు డీజీ విజయ్ కుమార్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, HCA అధికారులు మరియు ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.









