* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..?
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
* రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
న్యూ ఢిల్లీ: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ (కంపా) నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని కేటాయించారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. అడవుల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇప్పటివరకు రూ.3,852 కోట్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కేటాయించే అటవీకరణ నిర్వహణ మరియు ప్రణాళిక అథారిటీ ( కంపా) నిధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు మొత్తం రూ. 3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, వన్యప్రాణుల ఆవాసాల మెరుగుదల, జీవవైవిధ్యాన్ని కాపాడే కార్యకలాపాలకు వీటిని కేటాయించాలనేది లక్ష్యం.
సీఏఎఫ్ చట్టం ద్వారా ఇలా..
పరిహార అటవీకరణ నిధి ( సిఏఎఫ్) చట్టం -2016 ద్వారా రాష్ట్ర నిధుల వినియోగం కోసం వార్షిక కార్యకలాపాల ప్రణాళిక(ఏపి ఓఎస్) రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. 2018 లో జత చేసిన నిబంధనల ప్రకారం కంపా నిధుల నుంచి రాష్ట్ర అటవీ శాఖకు పరిహార ఫండ్ కచ్చితంగా లభిస్తుందని వివరించారు.









