“దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్” ద్వారా తెలంగాణలో శిక్షణ పొందిన కృషి, బీమా, బ్యాంకు సఖుల వివరాలేంటి..?
* దళిత, ఆదివాసీ మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తున్నారు?
* ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ ల కార్యాచరణ తెలపండి
* లోక్ సభలో కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* లిఖిత పూర్వక సమాధానమిచ్చిన కేంద్రసహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
న్యూ ఢిల్లీ: మహిళల సాధికారత కోసం, ప్రధానంగా దళిత, ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై – ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది కృషి సఖీలు, బ్యాంక్, బీమా సఖిలకు శిక్షణ ఇచ్చారో తెలపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ కార్యాచరణ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో 9,778 మంది మహిళలకు శిక్షణ..
దేశవ్యాప్తంగా కృషి సఖిలు 1,87,745 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. పశు, బ్యాంక్, బీమా సఖిలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖిలు మొత్తంగా 6,27,984 మంది ఉండగా.. తెలంగాణలో 9,778 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు.
దళిత, గిరిజన, ఆదివాసీలు ఇలా….
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై- ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా దళిత, గిరిజన, ఆదివాసీ మహిళలు సంఘాలుగా ఏర్పడి ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకెళుతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. ఇందులో దళిత మహిళలు దేశవ్యాప్తంగా 21 కోట్ల మంది ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో 8,24,432 మంది, త్రిష వ్యాప్తంగా ఆదివాసీ మహిళలు సంఘాల్లో సభ్యులుగా 12 కోట్ల మంది ఉన్నారని ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4,97,303 మంది ఉన్నారని తెలిపారు. స్టార్టప్ విలేజ్ ఎంటర్ ప్రేన్యూర్ షిప్ ప్రోగ్రాం (ఎస్వీఈపీ) ద్వారా 18,959 బ్లాక్ లతో సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్ఐఆర్ డీపీఆర్ ప్రణాళికతో ముందుకు..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్ డీపీఆర్) ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో గత నవంబర్ వరకు 914 శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించినట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ముందుకెళ్తున్నట్లు వివరించారు.









