తప్పుడు ప్రచారాలు, అక్రమ వసూళ్లపై అడ్-హాక్ కమిటీ హెచ్చరిక.
మామిడి సోమయ్యకు సంఘంతో సంబంధం లేదనడం అవివేకం.
జర్నలిస్టుల హక్కులు,
సంఘ బలోపేతంపై కీలక నిర్ణయాలు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మహాసభ ఈ నెల 14న జిల్లా కేంద్రంలో జరగనున్నట్లు అడ్హక్ కమిటీ కన్వీనర్ టి.ఎస్.చక్రవర్తి, కో-కన్వీనర్లు అర్వపల్లి నగేష్, నానబాల రామకృష్ణ, అంతోటి శ్రీనివాస్, వందనపు సామ్రాట్ లు తెలిపారు. ఈ మహాసభను ఫెడరేషన్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, వారికి సంఘంతో సంబంధం లేదని ప్రచారం చేయడం అవివేకమని వారు స్పష్టం చేశారు.
జిల్లా మహాసభల పేరుతో కొందరు వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు, సమాచారం లభించిందని, టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో జరిగే ఏ వసూళ్లనైనా కఠినంగా ఖండిస్తున్నామని, కమిటీ సభ్యులు హెచ్చరించారు. రాష్ట్ర, జిల్లా కమిటీల కాలపరిమితి ముగిసినా పదవుల్లో కొనసాగుతూ, తప్పుడు ప్రకటనలు చేస్తున్న వారిని జర్నలిస్టులు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మహాసభలో జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, అక్రిడేషన్ కార్డులు, మహిళా జర్నలిస్టుల పరిరక్షణ- హక్కులు వంటి ముఖ్య అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నాయకులు వంగా పుంగమ గౌడ్, కప్పల మధు, అమరబోయిన ఉపేందర్, కందరబోయిన కృష్ణ, కాసోజు శ్రీధర్, షకీల్, నజీర్, స్వర్ణ, సుధా గాని కరుణాకర్, అఖిల్, ప్రణయ్, హేమంత్, కాశి, శశి, శివకుమార్, అర్జున్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.









