పోలింగ్ కి సిద్ధం అయినా జమ్మిగూడెం: ముద్దిన నర్సమ్మకు తిరుగులేని ఆధిక్యంపై బిఆర్ఎస్ సంబరాలు.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి ) డిసెంబర్ 13: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఆదివారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారం ముగియడంతో, బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్దిన వెంకట నర్సమ్మ విజయంపై గ్రామస్థుల్లో, పార్టీ శ్రేణుల్లో పూర్తి ధీమా వ్యక్తమవుతోంది. గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సమ్మ తరపున జరిగిన విస్తృత ప్రచారంలో ఆమెకు లభించిన అపూర్వ ఆదరణ, ఓటుగా మారడం ఖాయమని బిఆర్ఎస్ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ యువత నర్సమ్మకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తానని ఆమె ఇచ్చిన హామీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచారం ముగింపులో ముద్దిన వెంకట నర్సమ్మ మాట్లాడుతూ నేను ప్రచారంలో ఉన్న ప్రతి వీధిలో ప్రతి ఇంటి వద్ద ప్రజలు చూపిన ఆప్యాయత, మద్దతు చూసి నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ ఎన్నికల్లో నా గెలుపు కేవలం నా వ్యక్తిగత విజయం కాదు, జమ్మిగూడెం గ్రామానికి రాబోయే అభివృద్ధికి నాంది. ప్రజల నుండి లభించిన అద్భుతమైన ఆదరణతో నా విజయం 100 శాతం ఖాయం అని నేను ధీమాగా చెబుతున్నాను. రేపటి పోలింగ్లో ప్రజలు మార్పు కోరుకునే వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న చర్చలు మరియు విశ్లేషణల ప్రకారం, నర్సమ్మకు ప్రత్యర్థి అభ్యర్థులపై గణనీయమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంది. ఆమె ప్రజలతో మమేకమైన తీరు, స్థానిక సమస్యలపై ఆమెకున్న అవగాహన, బీఆర్ఎస్ పార్టీ బలంతో కలిసి నర్సమ్మ విజయాన్ని సునాయాసం చేయనున్నాయి. జమ్మిగూడెం గ్రామ పంచాయతీకి రేపు జరిగే పోలింగ్ గ్రామాభివృద్ధికి ఒక కొత్త దిశానిర్దేశం చేయనుందని, ఫలితాల కోసం యావత్ గ్రామం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోందని చెప్పవచ్చు.









