తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పీఎంజీఎస్ వై ద్వారా 1,023 కి. మీ. రోడ్లు.
* రహదారుల సమస్యలపై పార్లమెంట్ లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
* నిర్మాణ నాణ్యత పర్యవేక్షణ, నిధుల వివరాలను కోరిన రామసహాయం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ( పిఎంజీఎస్ వై ), ఆర్సిపిఎల్ డబ్ల్యూఈఏ ఆధ్వర్యంలో 1,023 కి. మీ. రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అనుసంధానంపై లోక్సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ..తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో 146 రహదారి పనులు, 112 వంతెనల నిర్మాణం… ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. మొత్తం 1,023కిలోమీటర్లు కాగా… రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 39 రహదారి పనులు (478 కి.మీ.), 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
*నాణ్యత–నిధులపై కేంద్ర పర్యవేక్షణ*
పిఎంజిఎస్ వై కింద చేపడుతున్న రహదారి పనుల నాణ్యతపై మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ అమల్లో ఉందని కేంద్రం వివరించింది. ఎన్ఆర్ఐడీఏ సాంకేతిక పరిశీలన, జాతీయ–రాష్ట్ర స్థాయి నాణ్యత తనిఖీలు, సీఏజీ ఆడిట్ల ద్వారా నిర్మాణ నాణ్యతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిధుల సకాల విడుదల కోసం రాష్ట్రాలతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
*జాతీయస్థాయిలో ఇలా..*
2016లో ప్రారంభించిన ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 వామపక్ష ప్రభావిత జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 12,212 కి.మీ. రహదారులు, 701 వంతెనలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 9,764 కి.మీ. రహదారులు, 528 వంతెనలు పూర్తయ్యాయని, మొత్తం వ్యయం రూ.9,339.74 కోట్లు అని వివరించారు.









