హామీలపై నిలదీస్తారనే భయంతోనే ముందస్తు నిర్బంధాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ నిప్పులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 29: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, అశ్వారావుపేట నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు కలకలం రేపుతున్నాయి. వేదాంతపురం మాజీ సర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ సోమిని శివశంకర్ ప్రసాద్ ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయగా, సోమవారం తెల్లవారుజామున మాల్లాయి గూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతాయనే భయంతోనే ఇలా ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటూ 420 హామీలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం, అరెస్టులతో కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు.
అరెస్టులు చేయడం కాదు దమ్ముంటే ఆడబిడ్డ పెళ్లికి ఇస్తానన్న లక్ష రూపాయలు, తులం బంగారం ఇవ్వాలని, అలాగే వృద్ధులకు రూ. 4వేలు, వికలాంగులకు రూ. 6వేల పెన్షన్, చదువుకునే యువతకు స్కూటీలు, పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగానైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టత ఇవ్వాలని, అక్రమ అరెస్టులు మానుకోవాలని హెచ్చరిస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినదించారు.









