అశ్వారావుపేటలో అట్టహాసంగా ప్రారంభమైన విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 03: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శనివారం నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న విశ్వవిద్యాలయ స్థాయి ఆటల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి పాల్గొనగా, యూనివర్సిటీ అబ్సర్వర్గా డాక్టర్ ఎస్. మధుసూధన రెడ్డి వ్యవహరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, వ్యవసాయం అనేది సమాజంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవప్రదమైన వృత్తి అని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం తోడుగా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సగటు రైతు ఒక ఐఏఎస్ తో సమానమని, ఇక్కడ ఐఏఎస్ అంటే ‘ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్’ అని ఆయన కొత్త అర్థాన్ని ఇస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇటువంటి గొప్ప వృత్తికి సేవ చేసే అవకాశం లభించిన విద్యార్థులు, అధ్యాపకులు నిజంగా అదృష్టవంతులని ఆయన పేర్కొన్నారు. ఆటల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యం ముఖ్యమని, ఈ క్రీడలను కేవలం పోటీగా మాత్రమే కాకుండా ఒకరి నుండి ఒకరు నేర్చుకునే అభ్యసన ప్రక్రియలా భావించాలని విద్యార్థులకు సూచించారు. మరో అతిథి డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా ప్రాచుర్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రీడా సంబరంతో కళాశాలలో పండుగ వాతావరణం ముందే వచ్చిందని యూనివర్సిటీ అబ్సర్వర్ డాక్టర్ మధుసూధన రెడ్డి పేర్కొంటూ, పోటీల నిర్వహణపై నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల నుండి సుమారు 467 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మరియు ఆఫీసర్ ఇంచార్జి ఆఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ డాక్టర్ ఎం. రామ్ ప్రసాద్ దగ్గరుండి సమన్వయపరిచారు.









