అరైవ్ అలైవ్ క్యాంపెయిన్: ఊట్లపల్లిలో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై యయాతి రాజు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 13: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా అశ్వారావుపేట పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మంగళవారం మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో ఎస్సై టి యయాతి రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి అని, ఇవి ప్రాణరక్షక కవచాల్లా పనిచేస్తాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ఘోర ప్రమాదాలను గతంలో జరిగిన సంఘటనలతో ఉదహరిస్తూ ఆయన గ్రామస్తులకు వివరించారు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని ఆయన కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని గ్రామస్తులందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.









