బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం
సత్తుపల్లిలో 81 మంది నూతన సర్పంచులకు ఘన సన్మానం
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకుండా పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన జరిగిన 81 మంది సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక బీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమిని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కినట్లు వాగుతారో.. అదే పద్ధతిలో గత పదేళ్లు పాలించిన వారు బ్లఫ్ చేస్తున్నారు. 10 మంది సర్పంచులను గెలిపించుకుని, కార్యకర్తలందరినీ నిలబెట్టి మేమే గెలిచామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
గతంలో ఎన్నికల ఫలితాలను సెమీఫైనల్స్గా అభివర్ణించిన మాజీ మంత్రులపై పొంగులేటి నిప్పులు చెరిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69 శాతం సీట్లు గెలిచి కాంగ్రెస్ తన జైత్రయాత్రను చాటింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇది 80 శాతానికి మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్న హెచ్చరికలు ప్రజల ముందు సాగవు. గతంలో అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను సరిచేసి, శాస్త్రీయంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను పొట్టలో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి నాంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









