ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. భారీ భోగి మంటలు వేసిన బిఆర్ఎస్ శ్రేణులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 14: సంక్రాంతి పండుగ సంబరాలు అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెంలో గ్రామంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునే జమ్మిగూడెం సెంటర్ జనసందోహంగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే భోగి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. పల్లెటూరి పద్ధతిలో, మన మట్టి వాసన ఉట్టిపడేలా భారీగా భోగి మంటలు వేసి, చలిలో వెచ్చని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందడి చేస్తూ, ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది కష్టాలను, పాత జ్ఞాపకాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ పండుగలకు ఆత్మగౌరవాన్ని తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ అని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. జమ్మిగూడెం సెంటర్ మొత్తం గులాబీ శ్రేణుల నినాదాలతో, ప్రజల కోలాహలంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా భోగి మంటల చుట్టూ చేరి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడంతో జమ్మిగూడెంలో ఐక్యత మరియు పండుగ సందడి రెట్టింపయ్యాయి.









