ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు గాలికి.. భక్తులకు కష్టాలే మిగిలే! నిలదీసిన బీజేపీ నాయకులు.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి ) జనవరి, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గుర్వాయిగూడెం గ్రామ పరిధిలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రమైన దుర్గమ్మ గట్టుపై వెలసిన స్వయంభూ శివాలయం నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందని బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి తీవ్రంగా విమర్శించారు. గురువారం దుర్గమ్మ గట్టును సందర్శించిన బీజేపీ నాయకుల బృందం అక్కడి దుస్థితిని పరిశీలించి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే విస్మరించారని, కనీసం భక్తులు నడిచి వెళ్లడానికి దారి కూడా లేక పెద్ద పెద్ద బండరాళ్లు, కంపచెట్లతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు ధ్వజమెత్తారు. నాయకుల పొలాలకు తారు రోడ్లు వేసుకుంటున్న ప్రజాప్రతినిధులు, వేల ఏళ్ల ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమని, ఇది సాక్షాత్తూ ఆ పరమశివుడిని మోసం చేయడమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే అసాధ్యమైన హామీల బాటలోనే ఎమ్మెల్యే హామీలు కూడా ఉన్నాయని, త్వరలో రానున్న మహాశివరాత్రి లోపు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు గూడ ముత్యాలరావు, కారం రత్నకుమారి, పల్లపు శిరీష తదితరులు పాల్గొన్నారు.









