యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 22: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కనీస కర్తవ్యమని ఉద్ఘాటించారు. 18 ఏళ్లలోపు వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, సరదా కోసం చేసే పనులు యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి, లైసెన్స్ లేకుండా వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సతీష్ కుమార్, సీఐ నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్మల, ఎస్సైలు సాయి కిషోర్ రెడ్డి, యయాతి రాజు, డాక్టర్ విజయ్ తదితరులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చివరగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.









