ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్,వైరా:
పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్ పెంపొందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
వైరా మండలం పాలడుగు గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగుతూ విద్యా భోదనను పరిశీలించారు. మూడవ, నాలుగు తరగతి గదులలో విద్యార్థులను ప్రత్యేకంగా అందించిన రైమ్స్ ఎలావున్నాయి, అని అడిగారు. బోర్డు పై ఇంగ్లీషు అక్షరాలు, పదాలు, పద్యాలు వ్రాసి వాటియొక్క ఉచ్చారణ, అర్ధం చేసుకుంటూ, తిరిగి చెప్పగలుగుతున్నారా, ధ్వనులను బట్టి ఇంగ్లీష్ పదాలను గుర్తిస్తున్నారా అని అడిగి విద్యార్థుల సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా పాఠశాల ఆవరణలోని కిచెన్ లో వండిన అన్నం, కూరలను కలెక్టర్ పరిశీలించారు. భోజనంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని సూచించారు. పాఠశాల పిల్లలతో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం మంచిగా ఉంటుందా, కోడిగుడ్డు మెనూ ప్రకారం పెడ్డుతున్నారా, కూరలు రుచిగా ఉంటున్నాయా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు. ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగ పడుతుందని, విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి బోధన అందించాలని సూచించారు.
ప్రతి రోజు విద్యార్థి గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యాసన చేసేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బుక్ లెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. బుక్లెట్ లో ఉన్న అంశాలను తూ.చ. తప్పకుండా ఉపాధ్యాయులు ఫాలో అవుతూ పిల్లలు చదివే సామర్థ్యం పెంపొందేలా కృషి చేయాలని అన్నారు.
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ తయారు చేశామని, దీనిని యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేసినట్లు, ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు అప్ డేట్ మాత్రం చేయాలని అన్నారు. ఆంగ్ల అక్షరాలను ఫోనెటిక్ సౌండ్ తో సహా నేర్పేలా కోర్సు డిజైన్ చేశామని అన్నారు.
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పరిపూర్ణంగా అమలు చేయవచ్చని, ప్రతి విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు పాఠశాల సమయాల్లోనే ప్రాథమిక తరగతి విద్యార్థులకు అమలు చేయాలని అన్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం వాడాలని, వంటకాల కోసం గ్యాస్ సిలిండర్ లను ఉపయోగించాలని, ప్రభుత్వ మెను ప్రకారం రోజువారి వంటకాలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ సందర్శించారు. చిన్న పిల్లలకు అందించే కోడిగుడ్డు, పోషక ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైరా తహసీల్దార్ సురేషు బాబు, మండల విద్యా అధికారి కె. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దయాకర్ రావు, రమేష్, శ్రీదేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








