*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓
మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం ప్రకటించింది. లేదంటే కఠిన వైఖరిని అవలంబిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటు దిశగా ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారా లేదా పోలీసులు అరెస్ట్ చేశారా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీరిని కర్రీగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలో భాగంగా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రజాసంఘాలు మాత్రం ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని లొంగుబాటు చేసినట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. నిజానిజాలు బయటకు రావాలంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది..








